విజయవాడ యువకుడు సాయికృష్ణ కేసు.. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

  • విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మృతి చెందినట్టు ఆరోపణలు
  • సిట్ ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్ మెంట్
  • ఐజీ రవి ప్రకాశ్ నేతృత్వంలో దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం
  • సస్పెండైన సీఐ నాగరాజుపై హత్య, ఆధారాల ధ్వంసం ఆరోపణలు
  • మే 9న అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి కనిపించలేదని తల్లి ఫిర్యాదు
  • సీఎం ఆదేశాలతో వేగవంతమైన దర్యాప్తు, సీఐ నాగరాజు విచారణ
విజయవాడలో సంచలనం సృష్టించిన యువకుడి కస్టడీ మృతి ఆరోపణల కేసు దర్యాప్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. 25 ఏళ్ల గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీ మృతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. శాంతిభద్రతల విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఎం. రవి ప్రకాశ్ ఈ సిట్‌కు నేతృత్వం వహించనున్నారు.

ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సభ్యులుగా ఉంటారని, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్. సుధాకర్‌ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సిబ్బందిని, సాంకేతిక, ఫోరెన్సిక్ సహకారాన్ని పోలీస్ శాఖలోని వివిధ విభాగాల నుంచి తీసుకునేందుకు సిట్‌కు పూర్తి అధికారాలు కల్పించారు.

ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సస్పెండెడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల ధ్వంసం వంటి ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేయనుంది. మృతుడు సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 19న సీఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్లు 127(4), 127(6), 103(1), 238 కింద కేసు నమోదు చేశారు. సింగ్ నగర్‌లోని ఆయన నివాసంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం నాగరాజును అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

అసలేం జరిగింది? 
విచారణ పేరుతో మే 9న తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లారని, అప్పటి నుంచి అతను తిరిగి రాలేదని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి, కొట్టి చంపేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, జూన్ 15న సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు విఫలం కావడంతో గడువును జూన్ 29కి పొడిగించింది.

ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 17న సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు ఆదేశించడమే కాకుండా సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు బృందాలు ఇప్పటికే విజయలక్ష్మి, ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీని, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించాయి. సాయికృష్ణను చంపి దహనం చేశారని తల్లి ఆరోపించిన నేపథ్యంలో కృష్ణలంకలోని శ్మశానవాటికలో మే 23 నుంచి 26 మధ్య దహనం చేసిన అనాథ శవాల రికార్డులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని, సాయి కృష్ణ, అతని తల్లి మొబైల్ ఫోన్ల కాల్ డేటా రికార్డులను భద్రపరచాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

Gade Sai Krishna
Vijayawada Custodial Death Case
Andhra Pradesh SIT Investigation
CI Nagarjuna Suspension
AP Police News
IG M Ravi Prakash

More Telugu News